CM Chandrababu Naidu: పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షిస్తూ ఆంధ్రప్రదేశ్ను ఉక్కు పరిశ్రమలకు కీలక గమ్యస్థానంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లిలో రూ.16,350 కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు, దేశంలో తొలిసారిగా గ్రీన్ స్టీల్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లోనే ప్రారంభమవుతోందని వెల్లడించారు. విశాఖపట్నం మాత్రమే కాకుండా రాయలసీమ ప్రాంతాన్ని కూడా పరిశ్రమల కేంద్రంగా అభివృద్ధి చేసి ‘ఉక్కుసీమ’గా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. గత ప్రభుత్వాల పాలనపై పరోక్షంగా విమర్శలు చేసిన ఆయన, స్టీల్ ప్రాజెక్టుల పేరుతో కొన్ని ప్రాంతాల్లో అవకతవకలు, వనరుల దుర్వినియోగం జరిగాయని వ్యాఖ్యానించారు.
కూటమి ప్రభుత్వ హయాంలో రాయలసీమ ప్రాంతానికి భారీగా పెట్టుబడులు తీసుకొచ్చామని, దాదాపు రూ.4 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వివిధ రంగాల్లో వచ్చాయని పేర్కొన్నారు. యువతకు స్థానికంగా ఉద్యోగాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. అనంతపురంలో కియా పరిశ్రమ స్థాపన తర్వాత ఆ ప్రాంత ఆర్థిక పరిస్థితి మారిపోయిందని, ఇప్పటివరకు అక్కడ లక్షలాది వాహనాల ఉత్పత్తి జరిగిందని ఆయన గుర్తుచేశారు.
రాయలసీమ అభివృద్ధి విషయంలో ఎవరు ఏం చేశారో ప్రజలు గమనించాలని చంద్రబాబు సూచించారు. ఫ్యాక్షన్ సంస్కృతి తగ్గించి ప్రాంతాన్ని అభివృద్ధి దిశగా తీసుకువచ్చామని పేర్కొన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు పూర్తి సహకారం అందిస్తామని, అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.








