South Central Railway: ప్రయాణికుల రద్దీని తగ్గించడం మరియు రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం లక్ష్యంగా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. చర్లపల్లి నుంచి నడుస్తున్న పలు ప్రత్యేక రైళ్ల సర్వీసులను మరోసారి పొడిగిస్తూ అధికారికంగా షెడ్యూల్ను ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు ప్రయాణించే వేలాది మంది ప్రయాణికులకు ఉపశమనం కలగనుంది.
చర్లపల్లి–షాలిమార్ ప్రత్యేక రైళ్ల విషయానికి వస్తే, ట్రైన్ నెం. 08045 ప్రతి శుక్రవారం నడవనుంది. జూలై 3, 10, 17, 24, 31 తేదీల్లో మొత్తం ఐదు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. తిరుగు ప్రయాణంగా చర్లపల్లి–షాలిమార్ రైలు (08046) ప్రతి శనివారం నడుస్తూ జూలై 4, 11, 18, 25తో పాటు ఆగస్టు 1 వరకు సర్వీసులు కొనసాగనున్నాయి.
అదే విధంగా చర్లపల్లి–పాట్నా మార్గంలో కూడా ప్రత్యేక రైళ్లు కొనసాగుతున్నాయి. పాట్నా–చర్లపల్లి (03253) రైలు సోమవారం, బుధవారం రోజుల్లో నడుస్తూ జూలై 20 నుంచి 29 వరకు నాలుగు సర్వీసులు అందించనుంది. చర్లపల్లి–పాట్నా (03254) రైలు బుధవారం రోజుల్లో జూలై 22 నుంచి 29 వరకు కొనసాగనుంది. అలాగే మరో సర్వీస్ (03255) ప్రతి శుక్రవారం నడుస్తూ జూలై 24 నుంచి 31 వరకు రెండు సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రణాళికలో భాగంగా నల్గొండ రైల్వే స్టేషన్ను ABSS పథకం కింద ఆధునిక స్థాయికి తీసుకెళ్లే పనులు కొనసాగుతున్నాయి. దాదాపు రూ.17.01 కోట్ల వ్యయంతో పునరాభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. రోజుకు సుమారు 3,000 మంది ప్రయాణికులు ఈ స్టేషన్ను వినియోగిస్తున్నారు. ప్రాజెక్టులో భాగంగా కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, ప్లాట్ఫారమ్ల విస్తరణ, షెల్టర్ల ఏర్పాటు, వెయిటింగ్ హాల్స్ ఆధునికీకరణ, సర్క్యులేటింగ్ ఏరియా అభివృద్ధి వంటి పలు పనులు చేపడుతున్నారు. ఈ మార్పులతో ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందనున్నాయి.








