Praggnanandhaa: చెన్నైలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు క్రీడాభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. నార్వే చెస్ 2026 టోర్నమెంట్లో చారిత్రాత్మక విజయాన్ని సాధించి భారతదేశానికి గౌరవం తీసుకొచ్చిన యువ గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానందకు తమిళనాడు సీఎం విజయ్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
సచివాలయంలో జరిగిన అధికారిక సమావేశంలో సీఎం విజయ్ ప్రజ్ఞానందను సత్కరించి రూ.50 లక్షల నగదు బహుమతిని అందజేశారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య జరిగిన ఓ సరదా చెస్ మ్యాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. సీఎం టేబుల్పైనే జరిగిన ఈ చిన్న పోరులో ప్రజ్ఞానంద, విజయ్తో చెస్ ఆడారు.
ఈ మ్యాచ్ గురించి ప్రజ్ఞానంద మాట్లాడుతూ, సీఎం కూడా చెస్ ఆడగలరని తనకు ముందుగా తెలియదని, బోర్డు తీసుకురమ్మని చెప్పినప్పుడు ఆశ్చర్యపోయానని తెలిపారు. ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే కొన్ని ఎత్తుల్లోనే తాను విజయం సాధించానని వివరించారు. అయితే సీఎం ఆటతీరును కూడా ఆయన ప్రశంసిస్తూ, చాలా ఆత్మవిశ్వాసంతో ఆడారని పేర్కొన్నారు. ఇక నార్వే చెస్ 2026 ఫైనల్లో జర్మనీ గ్రాండ్ మాస్టర్ విన్సెంట్ కీమర్పై విజయం సాధించి ప్రజ్ఞానంద ఈ ప్రతిష్టాత్మక టైటిల్ను గెలుచుకున్నారు.
నార్వే చెస్ చరిత్రలో ఈ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా ఆయన రికార్డు సృష్టించారు. వరుసగా నాలుగు క్లాసికల్ గేమ్స్లో విజయాలు సాధించి తన కెరీర్లోనే అత్యంత పెద్ద విజయాన్ని నమోదు చేశారు. ఈ టోర్నమెంట్లో ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్సన్తో పాటు ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ గుకేష్, ఫిరౌజ్జా, సో వంటి ప్రముఖ ఆటగాళ్లు పాల్గొన్నారు. అయినప్పటికీ చెన్నైకి చెందిన 20 ఏళ్ల ప్రజ్ఞానంద తన ప్రతిభతో అందరినీ అధిగమించి విజేతగా నిలవడం విశేషంగా నిలిచింది.
ALSO READ: Aqua Farmers | ఆక్వా రైతులకు న్యాయం చేస్తాం: సీఎం చంద్రబాబు








