Rumesh Tharanga Pathirage: “క్రికెట్ను వీడి జావెలిన్ను ఎంచుకున్న యువ క్రీడాకారుడు.. ఇప్పుడు ప్రపంచ అథ్లెటిక్స్లో తనదైన ముద్ర వేస్తున్నాడు.” ఒకప్పుడు క్రికెట్ మైదానంలో ఫాస్ట్ బౌలర్గా ప్రత్యర్థులను బెంబేలెత్తించిన యువకుడు.. ఇప్పుడు జావెలిన్ త్రోలో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాడు. శ్రీలంకకు చెందిన 23 ఏళ్ల రుమేష్ తరంగ పతిరాగే రోమ్ డైమండ్ లీగ్ 2026లో అద్భుత ప్రదర్శనతో అంతర్జాతీయ క్రీడా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు.
ఇటలీలోని రోమ్లో జరిగిన పురుషుల జావెలిన్ త్రో పోటీల్లో రుమేష్ 92.62 మీటర్ల దూరం ఈటెను విసిరి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. రెండో ప్రయత్నంలోనే ఈ ఘనత సాధించిన అతడు, 2026 సీజన్లో ప్రపంచంలోనే అత్యుత్తమ మార్కు నమోదు చేసిన తొలి అథ్లెట్గా నిలిచాడు. ఈ ప్రదర్శనతో రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న రోమ్ మీట్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు.
ఈ విజయంతో 90 మీటర్ల క్లబ్లో చోటు సంపాదించిన రుమేష్, ఆసియా నుంచి ఈ ఘనత సాధించిన నాలుగో అథ్లెట్గా చరిత్ర సృష్టించాడు. అంతేకాకుండా భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా వ్యక్తిగత అత్యుత్తమ రికార్డును అధిగమించి తన సత్తా చాటాడు.
కలుతర ప్రాంతానికి చెందిన రుమేష్ చిన్నతనంలో క్రికెట్పై మక్కువతో ఎదిగాడు. అయితే తీవ్ర పోటీ కారణంగా జావెలిన్ వైపు మళ్లి తన కెరీర్ను మార్చుకున్నాడు. ప్రస్తుతం ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన అతడు, భవిష్యత్లో ఆసియా క్రీడలు మరియు అంతర్జాతీయ టోర్నమెంట్లలో మరింత ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీలంక క్రీడా చరిత్రలో ఈ ప్రదర్శన ఒక మైలురాయిగా నిలిచిపోనుంది.
ALSO READ: Delimitation Bill | డీలిమిటేషన్ బిల్లుపై కేంద్రం ఫోకస్.. 2029 ఎన్నికలకే కొత్త రాజకీయ సమీకరణాలు?








