Delhi Fire Accident: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మాలవీయ నగర్ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భారీ విషాదం నెలకొంది. లెమన్ గ్రీన్ అనే రెస్టారెంట్ బేస్మెంట్లో ఉదయం సుమారు 8.50 గంటల సమయంలో మంటలు ప్రారంభమైనట్లు సమాచారం. మంటలు వేగంగా వ్యాపించడంతో అక్కడ ఉన్న వారు బయటకు రావడానికి అవకాశం లేకపోయింది.
ఈ ఘటనలో సుమారు 20 మంది సజీవ దహనమయ్యారని అధికారులు వెల్లడించారు. మరో 35 మందిని సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయి. మృతుల్లో విదేశీయులు కూడా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. ప్రస్తుతం ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
ప్రాణనష్టం అత్యంత బాధాకరమని పేర్కొన్న ఆయన, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుండి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా, గాయపడిన వారికి రూ.50 వేల ఆర్థిక సాయం అందజేయనున్నట్లు ప్రకటించారు. ఈ ఘటనతో ఢిల్లీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.








