AP PGCET 2026 results: ఏపీ పీజీసెట్ 2026 రిజల్ట్స్ను తాజాగా విడుదల చేశారు. ఈ పరీక్షలు మే 8 తేదీ నుంచి మే 11 తేదీ వరకు నిర్వహించబడగా, ఫలితాలను ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’ వేదిక ద్వారా అధికారికంగా వెల్లడించారు. ఈ పరీక్షకు మొత్తం 19,118 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 16,406 మంది పరీక్షలకు హాజరయ్యారు.
పరీక్షకు హాజరైన అభ్యర్థుల్లో 15,020 మంది ఉత్తీర్ణత సాధించగా, మొత్తం ఉత్తీర్ణత శాతం 91.55గా నమోదైంది. ఈ పరీక్షలో అర్హత పొందిన విద్యార్థులకు రాష్ట్రంలోని 17 యూనివర్సిటీల్లో 30 వివిధ సబ్జెక్టుల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ ఏడాది AP PGCET పరీక్షను తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నిర్వహించింది.
ఫలితాలు విడుదలైన సందర్భంగా మంత్రి నారా లోకేశ్ విజేతలకు అభినందనలు తెలిపారు. ఈ అధిక ఉత్తీర్ణత శాతం విద్యార్థుల కృషి, పట్టుదలకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ప్రతి అభ్యర్థికి ఉన్నత విద్యతో పాటు పరిశోధన రంగాల్లో మంచి భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించారు.








