HYDRAA Eagle Team: తెలంగాణలో హైడ్రా కొత్త ప్రయోగం చేపట్టింది, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ వినూత్న చర్య సామాజిక మార్పుకు మార్గం సుగమం చేస్తోంది. హైడ్రా విభాగంలో 16 మంది ట్రాన్స్జెండర్లకు ఉద్యోగాలు కల్పించి, వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది.
ఈ బృందంలో 11 మంది ట్రాన్స్ మహిళలు, ఐదుగురు ట్రాన్స్ పురుషులు ఉన్నారు. వీరిని “హైడ్రా ఈగిల్ టీమ్”గా నియమించి, హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో చెరువులు, ప్రభుత్వ భూములపై అక్రమ కట్టడాల తొలగింపు కార్యక్రమాల్లో భాగస్వాములను చేసింది.
కబ్జాదారులు ఎంతటి ప్రభావశీలులైనా భయపడకుండా, నిర్భయంగా తమ విధులను నిర్వర్తిస్తున్న ఈ బృందం, అధికారులు–ప్రజల మధ్య సమన్వయం చేస్తూ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రత్యేకంగా మహిళలతో మాట్లాడటం, ఉద్రిక్తతలను తగ్గించడం వంటి పనుల్లో వీరు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ఇటీవల సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్లో 862 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడటంలో, అలాగే మాదాపూర్ ఎదులకుంట చెరువు రక్షణలో ఈ బృందం కీలకంగా వ్యవహరించింది.
హైడ్రా అధికారులు వీరి పనితీరును ప్రశంసించారు. క్షేత్రస్థాయిలో వీరు చూపిస్తున్న నైపుణ్యం మంచి ఫలితాలు ఇస్తోందని తెలిపారు. “గతంలో బతుకుదెరువు కోసం ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కానీ ఇప్పుడు యూనిఫామ్లో గౌరవంగా విధులు నిర్వర్తిస్తున్నాం” అని తాన్షి రాయ్ తెలిపారు.
అలాగే అవకాశం ఇస్తే ట్రాన్స్జెండర్లు ఏ రంగంలోనైనా రాణించగలరని గాయత్రి పేర్కొన్నారు. ఈ ఉద్యోగాల ద్వారా వారు ఆర్థికంగా స్థిరపడటమే కాకుండా, సమాజంలో తమకు కూడా స్థానం ఉందనే ఆత్మవిశ్వాసాన్ని పొందారు.








