దేశీయ టెలికాం దిగ్గజం Bharti Airtel మార్కెట్ క్యాపిటలైజేషన్లో భారీ ఎగసిపడుతూ దేశంలోని రెండో అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది. దీంతో HDFC Bank మూడో స్థానానికి చేరింది. ప్రస్తుతం దేశంలో అత్యంత విలువైన కంపెనీగారిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance Industries) కొనసాగుతోంది.
ఇంట్రాడే ట్రేడింగ్లో భారతి ఎయిర్టెల్ మార్కెట్ క్యాప్ రూ.11.90 లక్షల కోట్లకు చేరగా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ విలువ రూ.11.80 లక్షల కోట్లుగా నమోదైంది. మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ రూ.18.11 లక్షల కోట్లకు పైగా ఉంది. భారతి ఎయిర్టెల్ షేర్లు వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్లోనూ లాభాల బాటలో పయనించాయి.
బీఎస్ఈలో ఈ షేర్ దాదాపు 3 శాతం పెరిగి రూ.1,953.95 ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. గత నాలుగు సెషన్లలో ఈ స్టాక్ 11 శాతానికి పైగా పెరిగింది. మే నెలలో ఇప్పటివరకు దాదాపు 4 శాతం లాభపడగా, ఏప్రిల్లో 6 శాతం ఎగబాకింది.
ఇక హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు మేలో స్థిరంగా కొనసాగగా, ఏప్రిల్లో 5.49 శాతం వృద్ధి నమోదు చేశాయి. గత ఏడాది నవంబర్ 21న భారతి ఎయిర్టెల్ షేరు రూ.2,174.70తో 52 వారాల గరిష్టాన్ని తాకగా, ఈ ఏడాది మే 13న రూ.1,745 కనిష్ట స్థాయికి చేరింది.
ఇదే సమయంలో కంపెనీ నాల్గో త్రైమాసిక ఫలితాలను కూడా ప్రకటించింది. క్యూ4లో కన్సాలిడేటెడ్ నికర లాభం త్రైమాసిక ప్రాతిపదికన 10.5 శాతం పెరిగి రూ.7,325 కోట్లకు చేరింది. అయితే గత ఏడాదితో పోలిస్తే 33.5 శాతం తగ్గింది.
గత ఏడాది లభించిన పన్ను రాయితీల కారణంగా అప్పటి లాభాలు ఎక్కువగా నమోదయ్యాయని కంపెనీ వెల్లడించింది. క్యూ4 ఫలితాల అనంతరం (Motilal Oswal Financial Services) ఈ స్టాక్పై ‘బై’ రేటింగ్ను కొనసాగించింది.
టార్గెట్ ధరను రూ.2,180గా నిర్ణయించింది. భారత్లో టారిఫ్ పెంపులు, బ్రాడ్బ్యాండ్ వినియోగదారుల వృద్ధి, ఆఫ్రికా వ్యాపార విస్తరణతో వచ్చే రెండేళ్లలో కంపెనీ ఆదాయం మరియు EBITDA బలంగా పెరుగుతాయని అంచనా వేసింది. అయితే టెక్నికల్ అనలిస్టులు మాత్రం జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. రూ.1,750 స్థాయికి పైగా ఉంటే దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు కొనసాగవచ్చని చెబుతున్నారు.
గ్లోబ్ క్యాపిటల్ మార్కెట్స్కు చెందిన విపిన్ కుమార్ ప్రకారం, గత 12 వారాలుగా స్టాక్ రూ.1,750 నుంచి రూ.1,900 మధ్య కన్సాలిడేషన్లో ఉండగా, ఇటీవల ఆ రేంజ్ను దాటిందన్నారు.
త్వరలోనే రూ.2,100 స్థాయిని పరీక్షించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అయితే AT Research and Risk Managers విశ్లేషకుడు ఆదిత్య థుక్రాల్ మాత్రం స్టాక్ ఇంకా కరెక్షన్ దశలోనే ఉందని హెచ్చరించారు.
రాబోయే నెలల్లో ఇది రూ.1,500 నుంచి రూ.1,600 స్థాయిలకు పడిపోయే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేమన్నారు. అందువల్ల కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకునే ఇన్వెస్టర్లు కొంతకాలం వేచి చూడటం మంచిదని సూచించారు.








