PM Modi UAE Visit: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) పర్యటనలో భారత ప్రధాని నరేంద్ర మోడీ కీలక ఒప్పందాలను కుదుర్చుకున్నారు. రక్షణ, ఇంధనం, మౌలిక వసతులు, పెట్టుబడుల రంగాల్లో భారత్-యూఏఈ మధ్య పలు వ్యూహాత్మక అగ్రిమెంట్లు కుదిరాయి.
ముఖ్యంగా రక్షణ సహకారానికి సంబంధించిన ఫ్రేమ్వర్క్ ఒప్పందం రెండు దేశాల మధ్య భద్రతా, సైనిక సంబంధాలను మరింత బలోపేతం చేయనుంది.
ఇంధన భద్రతకు సంబంధించి కూడా రెండు దేశాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్కు సంబంధించిన అవగాహన ఒప్పందంతో పాటు భారత్కు ఎల్పీజీ సరఫరాలపై అంగీకారం కుదిరింది. దీంతో హైడ్రోకార్బన్ రంగంలో దీర్ఘకాలిక భాగస్వామ్యం మరింత విస్తరించనుంది.
అబుదాబిలో ప్రధాని మోడీకి ఘన స్వాగతం లభించింది. యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమైన మోడీ, ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు.
గుజరాత్లోని వడినార్లో షిప్ రిపేర్ క్లస్టర్ ఏర్పాటు కోసం మరో ఎంఓయూ కుదిరింది. దీని ద్వారా పోర్ట్ ఆధారిత పరిశ్రమలు, ఉపాధి అవకాశాలకు ఊతం లభించనుంది.
భారత్లో మౌలిక వసతుల ప్రాజెక్టులు, ఆర్థిక రంగ పెట్టుబడుల కోసం యూఏఈ నుంచి 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ప్రకటించబడ్డాయి. గత 25 ఏళ్లలో భారత్కు విదేశీ పెట్టుబడులు పెట్టిన దేశాల్లో యూఏఈ కీలక భాగస్వామిగా కొనసాగుతోంది.
యూఏఈలో నివసిస్తున్న 45 లక్షలకుపైగా భారతీయుల సంక్షేమంపైనా సమావేశంలో చర్చ జరిగింది. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ, యూఏఈ భారత్కు విశ్వసనీయ ఇంధన భాగస్వామిగా కొనసాగుతోందని కేంద్రం పేర్కొంది.








