Kerala Chief Minister: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత వీడీ సతీషన్ను పార్టీ హైకమాండ్ అధికారికంగా ప్రకటించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో సీఎం ఎంపికపై ఉత్కంఠ నెలకొంది.
చివరకు ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో జరిగిన కీలక సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ సహా పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. అనంతరం పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ అధికారిక ప్రకటన చేశారు.
సీఎం పదవి కోసం కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితల పేర్లు కూడా బలంగా వినిపించినప్పటికీ, పార్టీ అధిష్ఠానం చివరకు వీడీ సతీషన్ వైపు మొగ్గు చూపింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన దాదాపు 10 రోజుల తర్వాత సీఎం అభ్యర్థి ఖరారవడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి 140 స్థానాలకు గాను 102 స్థానాలను కైవసం చేసుకుని ఘన విజయాన్ని నమోదు చేసింది. మరోవైపు ఎల్డీఎఫ్ కూటమి కేవలం 35 స్థానాలకే పరిమితమైంది. భారీ మెజార్టీతో గెలిచిన యూడీఎఫ్ ప్రభుత్వాన్ని వీడీ సతీషన్ ముందుండి నడిపించనున్నారు.








