అమరావతిలో సాంకేతిక రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టం చోటుచేసుకుంది. ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతదేశంలో తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) ప్రారంభించారు.
ఈ సందర్భంగా స్వదేశీ క్వాంటం కంప్యూటింగ్ సాంకేతికత దేశానికి గర్వకారణమని ఆయన తెలిపారు. అమరావతి క్వాంటం వ్యాలీ అభివృద్ధి రాష్ట్రానికే కాకుండా దేశ ప్రతిష్ఠను కూడా మరింత పెంచుతుందని ఆయన పేర్కొన్నారు.
SRM యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన 1S ఓపెన్ యాక్సెస్ క్వాంటం ఫెసిలిటీతో పాటు, మేధా టవర్స్లో 1Q పేరుతో మరో క్వాంటం సిస్టమ్ను కూడా ప్రారంభించారు.
ఈ రెండు క్వాంటం టెస్ట్ బెడ్స్ ద్వారా పరిశోధకులు, విద్యార్థులు మరియు పరిశ్రమలు క్వాంటం టెక్నాలజీని పరీక్షించేందుకు, అభివృద్ధి చేసేందుకు కీలక వేదికగా ఉపయోగించుకోనున్నాయి.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, క్వాంటం సైన్స్కు వందేళ్లు పూర్తైన సందర్భంలో ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కావడం గర్వకారణమని తెలిపారు. క్వాంటం టెక్నాలజీ భవిష్యత్తును నిర్ణయించే శక్తిగా మారనుందని, డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ ఎంత కీలకమో భవిష్యత్తులో క్వాంటం అంతే అవసరమని అన్నారు.
టెక్నాలజీని అర్థం చేసుకుని ప్రోత్సహించే నాయకత్వం దేశానికి అవసరమని, ప్రధాని నరేంద్ర మోదీ ఈ దిశగా ముందుకు తీసుకెళ్తున్నారని ఆయన ప్రశంసించారు.
కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతి క్వాంటం వ్యాలీ వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. కేవలం ఎనిమిది నెలల్లోనే ఈ ఫెసిలిటీలు సిద్ధం కావడం విశేషమని పేర్కొన్నారు.








