Kuwait Power Plant: పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తాజాగా కువైట్లోని విద్యుత్ ఉత్పత్తి మరియు నీటి శుద్ధి కర్మాగారాల(kuwait water plant)ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణి దాడి జరిపినట్లు కువైట్ అధికారులు వెల్లడించారు.
ఈ దాడిలో భారత్కు చెందిన ఓ కార్మికుడు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఘటనపై కువైట్ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
అధికారుల వివరాల ప్రకారం, క్షిపణి దాడి కారణంగా ప్లాంట్ సమీపంలోని ఓ సర్వీస్ భవనం తీవ్రంగా దెబ్బతింది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఈ విద్యుత్, నీటి శుద్ధి కేంద్రం కువైట్లో ఏ ప్రాంతంలో ఉందన్న విషయాన్ని వెల్లడించలేదు.
దాడి జరిగిన వెంటనే టెక్నికల్ సిబ్బంది, ఎమర్జెన్సీ రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ప్లాంట్ నిర్వహణ వ్యవస్థను పునరుద్ధరించడం, అక్కడి పరిస్థితులను అదుపులోకి తేవడం కోసం అధికారులు వేగంగా చర్యలు తీసుకుంటున్నారు.
ఈ ఘటనతో కువైట్లో పనిచేస్తున్న విదేశీ కార్మికుల్లో భయం నెలకొంది. ముఖ్యంగా భారతీయుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో యూఏఈలో కూడా ఇటీవల ఇలాంటి విషాదం చోటుచేసుకున్న విషయం గుర్తుకు వస్తోంది.
ఇరాన్ క్షిపణులను యూఏఈ గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకున్నప్పటికీ, వాటి శకలాలు ఓ వీధిలో పడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అందులో ఓ భారతీయుడు కూడా ఉండటం కలకలం రేపింది.
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు సాధారణ ప్రజల ప్రాణాలకే ముప్పుగా మారుతున్నాయి. యుద్ధం మరింత విస్తరించే ప్రమాదం ఉందన్న ఆందోళన అంతర్జాతీయ స్థాయిలో వ్యక్తమవుతోంది.








