Amaravati Capital: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఈ అంశంపై చర్చించేందుకు ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభమైంది.
రాజధాని అమరావతి చట్టబద్ధతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో అధికారికంగా తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై సభలో సుమారు నాలుగు గంటలపాటు సుదీర్ఘ చర్చ జరగనుంది. అనంతరం ఆమోదం పొందిన తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపనుంది.
తెలుగు రాష్ట్రాల విభజన అనంతరం హైదరాబాద్ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆ గడువు 2024 జూన్ 2తో ముగిసినా, ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాజధానికి స్పష్టమైన చట్టబద్ధత రాకపోవడం రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఈ నేపథ్యంలో అమరావతికి చట్టపరమైన బలం తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఐదున్నర కోట్ల మంది ఆంధ్రుల ఆకాంక్షలకు ఈ సభ ప్రతిరూపమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు అడ్డుగా నిలిచిన అనిశ్చితులను శాశ్వతంగా తొలగించే యజ్ఞమే ఈ ప్రత్యేక సమావేశమని అన్నారు.
2014లో ప్రజలు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించే బాధ్యతను చంద్రబాబుకు అప్పగించారని, అయితే అనంతరం వచ్చిన ప్రభుత్వం అమరావతిని పక్కనబెట్టి మూడు రాజధానుల ప్రతిపాదనతో అయోమయాన్ని సృష్టించిందని విమర్శించారు.
దీనివల్ల భూములు ఇచ్చిన రైతులు మాత్రమే కాకుండా మొత్తం రాష్ట్రం నష్టపోయిందని స్పీకర్ పేర్కొన్నారు. 2014లోనే అన్ని రాజకీయ పార్టీలు అమరావతిని రాజధానిగా అంగీకరించినప్పటికీ, గత ప్రభుత్వ నిర్ణయాల కారణంగా చట్టబద్ధత ప్రక్రియ నిలిచిపోయిందన్నారు.
ఇక మళ్లీ అలాంటి పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతోనే ఇప్పుడు అసెంబ్లీ ద్వారా అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నట్లు స్పష్టం చేశారు.








