Friday, August 7, 2026
Chat on WhatsApp
HomeInterNationalతన కూతురికి టీకా వేయించి ఆదర్శంగా నిలిచిన పాక్ మంత్రి

తన కూతురికి టీకా వేయించి ఆదర్శంగా నిలిచిన పాక్ మంత్రి

-

Chat on WhatsApp

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ (సర్వైకల్ క్యాన్సర్) నిర్మూలన దిశగా పాకిస్థాన్ చారిత్రాత్మక అడుగు వేసింది. ఈ వ్యాధి కారణంగా దేశంలో ప్రతిరోజూ ఎనిమిది మంది మహిళలు ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో, ప్రభుత్వం సెప్టెంబర్ 15న భారీ హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్‌) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా 9 నుంచి 14 ఏళ్ల మధ్య వయస్సు గల 1.3 కోట్ల బాలికలకు టీకాలు వేసే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది.

అయితే, కార్యక్రమం ప్రారంభమైన కొద్ది రోజులకే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు, అపోహలు పెద్ద సవాలుగా మారాయి. ఈ వ్యాక్సిన్ వంధ్యత్వానికి కారణమవుతుందని, ఇది విదేశీ కుట్రలో భాగమని వదంతులు వ్యాపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అనేక తల్లిదండ్రులు తమ పిల్లలకు టీకా వేయించేందుకు వెనుకంజ వేయగా, కొన్ని పాఠశాలలు ఆరోగ్య కార్యకర్తలను లోపలికి అనుమతించలేదు.

ఈ ప్రతికూలతలను ఎదుర్కోవడానికి పాకిస్థాన్ ఆరోగ్య మంత్రి సయ్యద్ ముస్తఫా కమల్ స్వయంగా ముందుకొచ్చారు. ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు తన కుమార్తెకు మీడియా ముందే హెచ్‌పీవీ టీకా వేయించారు. “ఈ వ్యాక్సిన్ సురక్షితమైనది, సమర్థవంతమైనది. మా ఆడపిల్లలను రక్షించుకోవడం మనందరి బాధ్యత. తప్పుడు ప్రచారాలకు బలికాకండి” అంటూ ఆయన పిలుపునిచ్చారు.

మంత్రి చర్యతో దేశవ్యాప్తంగా వ్యతిరేకత గణనీయంగా తగ్గింది. ప్రజల్లో నమ్మకం పెరిగి, టీకాలు వేయించుకునే వారి సంఖ్య భారీగా పెరిగింది. ఈ మార్పుతో, మొదట సెప్టెంబర్ 27తో ముగియాల్సిన వ్యాక్సినేషన్ గడువును ప్రభుత్వం అక్టోబర్ 1 వరకు పొడిగించింది.

సింధ్ ప్రావిన్స్ ఆరోగ్య మంత్రి డాక్టర్ అజ్రా ఫజల్ మాట్లాడుతూ, “ప్రజల్లో అపోహలు తొలగిపోయిన తర్వాత వారు స్వచ్ఛందంగా టీకా కేంద్రాలకు రావడం మొదలుపెట్టారు. ఇప్పటివరకు లక్ష్యంగా పెట్టుకున్న 1.3 కోట్లలో 92 లక్షల మందికి టీకా వేసి 78 శాతం విజయాన్ని సాధించాం” అని తెలిపారు.

ఈ విజయంతో పాకిస్థాన్ ఆరోగ్య రంగం ఒక పెద్ద మైలురాయిని చేరుకుంది. ప్రభుత్వం రాబోయే నెలల్లో ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. మానవజాతిని సర్వైకల్ క్యాన్సర్ నుంచి రక్షించాలన్న లక్ష్యంతో ఈ యత్నం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

UPI digital payment | UPI వినియోగదారులకు అలర్ట్.. కేంద్రం కొత్త నిర్ణయం ఇదే!

UPI digital payment: దేశంలో డిజిటల్ చెల్లింపులకు వెన్నెముకగా మారిన యూపీఐ (UPI) వ్యవస్థలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్టం-2007 సవరణ బిల్లుకు...
- Advertisement -
Chat on WhatsApp