ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం (హైకోర్టు) సరికొత్త చరిత్రకు వేదిక కాబోతోంది. ఏపీ హైకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా (సీజే) జస్టిస్ లీసా గిల్ను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి కీలక సిఫారసు చేసింది. ప్రస్తుతం పంజాబ్ – హర్యానా హైకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా సేవలందిస్తున్న ఆమె, కేంద్రం నుంచి అధికారిక ఆమోదం లభించిన వెంటనే అమరావతిలో బాధ్యతలు చేపట్టనున్నారు. న్యాయపాలనలో ఎక్కడా విరామం లేకుండా చూడాలనే లక్ష్యంతో, ప్రస్తుత సీజేలు రిటైర్ కావడానికి రెండు నెలల ముందే వారి వారసుల పేర్లను కేంద్రానికి పంపేలా సుప్రీంకోర్టు కొలీజియం తన పనితీరులో ఈసారి వినూత్న మార్పును ప్రవేశపెట్టింది.
మరోవైపు, మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవికి కూడా కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మధ్యప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సుశ్రుత్ అరవింద్ ధర్మాధికారిని మద్రాస్ హైకోర్టు సీజేగా సిఫారసు చేసింది. పరిపాలనాపరమైన జాప్యాన్ని నివారించేలా కొలీజియం ముందస్తుగా చేసిన ఈ సిఫారసులతో దేశంలోని కీలక హైకోర్టులకు కొత్త సారథులు రానున్నారు.









