Oman Ship Attack: ఒమన్ గల్ఫ్లో జరిగిన ఒక ఘోర సముద్ర ఘటన అంతర్జాతీయంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. భారతదేశానికి చెందిన ఓ నౌకపై అమెరికా సైన్యం దాడి చేసినట్లు సమాచారం వెలువడింది. ఈ దాడిలో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారని, మిగిలిన 21 మంది సిబ్బందిని రక్షించినట్లు తెలుస్తోంది. సమాచారం ప్రకారం, మొత్తం 24 మంది భారతీయ సిబ్బంది ఉన్న ఈ ట్యాంకర్ ఇరాన్ నుంచి చమురు రవాణా చేస్తోందన్న అనుమానంతో అమెరికా చర్య తీసుకున్నట్లు పేర్కొంది. ఆదేశాలను పాటించలేదనే కారణంతోనే ఈ దాడి చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించినట్లు సమాచారం.
యుద్ధ విమానం ద్వారా నౌక ఇంజిన్ గదిపై ఖచ్చితమైన క్షిపణి దాడి జరిపినట్లు అధికారులు ధృవీకరించారు. దాడి అనంతరం నౌకలో భారీగా మంటలు చెలరేగి, కొద్దిసేపటికే సముద్రంలో మునిగిపోయినట్లు తెలుస్తోంది. ఘటన సమయంలో నౌకలో ఉన్న సిబ్బంది సహాయం కోసం వేడుకున్నప్పటికీ తక్షణ స్పందన లభించలేదని సమాచారం. ఈ ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. న్యూఢిల్లీలోని అమెరికా డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ను భారత విదేశాంగ శాఖ పిలిపించి అధికారికంగా గట్టి నిరసన వ్యక్తం చేసింది.
భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ, మరణించిన నావికుల కుటుంబాలకు సంతాపం తెలిపింది. ప్రస్తుతం ఈ ఘటనపై అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. సముద్ర భద్రత, వాణిజ్య నౌకల రక్షణపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతున్న ఈ సంఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.








