Khawaja Asif: గతంలో అమెరికాతో చేతులు కలపడం పాకిస్థాన్ చేసిన అతిపెద్ద తప్పిదమని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ఘన్ యుద్ధాల సమయంలో అమెరికా తన వ్యూహాత్మక అవసరాల కోసం పాకిస్థాన్ను వినియోగించుకుని, లక్ష్యాలు నెరవేరిన తర్వాత వదిలేసిందని ఆయన ఆరోపించారు. టాయిలెట్ పేపర్ కన్నా హీనంగా తమను చూసిందని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
పాకిస్థాన్ పార్లమెంట్లో మాట్లాడిన ఖవాజా ఆసిఫ్.. గతంలో మిలిటెంట్లకు మద్దతు ఇవ్వడం ఘోర తప్పిదమని అంగీకరించారు. అప్పటి సైనిక పాలకులు చేసిన పొరపాట్ల కారణంగానే దేశంలో ఉగ్రవాదం పెరిగిందన్నారు.
జియా ఉల్ హక్, పర్వేజ్ ముషర్రఫ్ పాలనలో అమెరికాను సంతోషపెట్టేందుకు ఆఫ్ఘన్ యుద్ధాల్లో పాల్గొన్నామని, అది మతపరమైన కారణాల కోసం కాదని స్పష్టం చేశారు.
9/11 దాడుల అనంతరం అమెరికాతో సన్నిహితంగా ఉండి తాలిబాన్కు వ్యతిరేకంగా పనిచేశామని తెలిపారు. అయితే ఆఫ్ఘన్ నుంచి అమెరికా ఉపసంహరించుకున్న తర్వాత పాకిస్థాన్ ఒంటరిగా మిగిలిపోయిందని, దాని వల్ల హింస, రాజకీయ అస్థిరత, ఆర్థిక సంక్షోభం తీవ్రమయ్యాయని అన్నారు.
ఆఫ్ఘన్ యుద్ధాల్లో పాల్గొనడం వల్ల పాకిస్థాన్కు జరిగిన నష్టం ఎప్పటికీ పూడ్చలేనిదని ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నారు.








