Artemis 2: అమెరికా అంతరిక్ష పరిశోధనలో మరో చారిత్రక మైలురాయి నమోదైంది. నాసా చేపట్టిన ఆర్టెమిస్-2 మిషన్ విజయవంతంగా ముగిసి, వ్యోమగాములు సురక్షితంగా భూమికి తిరిగి చేరుకున్నారు. చంద్రుడిని చుట్టివచ్చిన ఈ ప్రయాణం పది రోజులపాటు కొనసాగింది.
కాలిఫోర్నియా సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలో శాన్డియాగో తీరానికి సమీపంగా ఒరాయన్ క్యాప్సూల్ విజయవంతంగా ల్యాండ్ అయింది. భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 5:38 గంటలకు ఈ ప్రక్రియ పూర్తైంది.
ఈ మిషన్లో అమెరికాకు చెందిన రీడ్ వైస్మాన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్తో పాటు కెనడాకు చెందిన జెరెమీ హాన్సెన్ పాల్గొన్నారు. ఈ బృందం మొత్తం 4,06,771 కిలోమీటర్ల దూరం ప్రయాణించి, ఇప్పటివరకు మానవులు చేరిన అత్యంత దూరమైన ప్రయాణంగా కొత్త రికార్డు సృష్టించింది.
ఈ యాత్రలో చంద్రుడి అవతలి వైపు దృశ్యాలు, అలాగే అరుదైన సూర్యగ్రహణం వంటి ఘటనలను వ్యోమగాములు చిత్రీకరించారు.
తిరుగు ప్రయాణంలో ఒరాయన్ క్యాప్సూల్ భూమి వాతావరణంలోకి అత్యంత వేగంతో ప్రవేశించి, మూడు భారీ పారాచూట్ల సహాయంతో పసిఫిక్ మహాసముద్రంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ విజయంతో అపోలో 13 మిషన్ రికార్డులు కూడా అధిగమించబడ్డాయి.
నాసా ఈ విజయాన్ని వీడియో రూపంలో విడుదల చేసి వ్యోమగాములకు స్వాగతం పలికింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ విజయంపై స్పందిస్తూ, వ్యోమగాములకు అభినందనలు తెలిపారు మరియు భవిష్యత్తులో అంగారక గ్రహ మిషన్ లక్ష్యంగా ముందుకు సాగాలని వ్యాఖ్యానించారు.








