Israel and Pakistan: పాకిస్థాన్లో అమెరికా-ఇరాన్(USA-IRAN) మధ్య శాంతి చర్చలు జరగనున్న వేళ, ఇజ్రాయెల్-పాకిస్థాన్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి కారణమయ్యాయి.
లెబనాన్లో ఇజ్రాయెల్ అమాయక పౌరులపై దాడులు చేస్తోందని ఆరోపిస్తూ, ఆ దేశాన్ని తీవ్రంగా విమర్శించారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ను “మానవాళికి శాపం”గా అభివర్ణించడమే కాకుండా, పలు కఠిన వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా వివాదాస్పదంగా మారడంతో, అనంతరం ఆయన ఆ పోస్టును తొలగించారు. అయితే అప్పటికే ఈ వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ తీవ్రంగా స్పందించింది.
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం ఖవాజా వ్యాఖ్యలను ఖండిస్తూ, ఒక దేశం నాశనాన్ని కోరడం అనేది అసహ్యకరమైన చర్యగా పేర్కొంది. శాంతి చర్చల్లో తటస్థంగా వ్యవహరించాల్సిన పాకిస్థాన్ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం ఆందోళనకరమని తెలిపింది.
ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియాన్ సర్ కూడా స్పందిస్తూ, తమ దేశాన్ని అవమానించే విధంగా చేసిన వ్యాఖ్యలు అసహనీయమని స్పష్టం చేశారు. మరోవైపు, అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ నేపథ్యంలో శాశ్వత శాంతి దిశగా ఇస్లామాబాద్లో కీలక చర్చలు జరగనున్నాయి.
ఈ సమయంలో ఇజ్రాయెల్-పాక్ మధ్య ఈ మాటల యుద్ధం మరింత ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.








