T-Fiber: తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ మౌలిక వసతుల బలోపేతానికి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు సెప్టెంబర్ 1 నుంచి టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలను వినియోగించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ప్రతి ప్రభుత్వ శాఖకు నిర్ణీత గడువులోగా టీ-ఫైబర్ కనెక్టివిటీ కల్పించాలని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 1 తర్వాత ప్రైవేట్ ఇంటర్నెట్ సేవలకు ప్రభుత్వ శాఖలు బిల్లులు చెల్లించవద్దని సూచించారు.
ప్రభుత్వ నిధుల వినియోగాన్ని మరింత సమర్థవంతంగా మార్చడంతో పాటు ఏకీకృత డిజిటల్ కనెక్టివిటీని విస్తరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వివరించారు. ప్రస్తుతం వినియోగంలో ఉన్న టీ-స్వాన్ (T-SWAN) నెట్వర్క్ను వచ్చే నెల రోజుల్లో పూర్తిగా టీ-ఫైబర్కు మార్చాలని అధికారులకు గడువు విధించారు. అలాగే ఫ్యూచర్ సిటీకి అత్యాధునిక ఫైబర్ కనెక్టివిటీ కల్పించే ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ‘ఇంటింటికీ ఇంటర్నెట్’ కార్యక్రమాన్ని వేగవంతం చేసి గ్రామీణ ప్రాంతాల వరకు నాణ్యమైన బ్రాడ్బ్యాండ్ సేవలు అందించాలని, తెలంగాణను దేశంలోనే అత్యుత్తమ డిజిటల్ కనెక్టివిటీ కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు.
ALSO READ: High Court | అరెస్ట్ తర్వాత ఊరట.. ఉదయనిధి స్టాలిన్ విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్!








