AP High Court: ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ-2025 నియామకాలపై కొనసాగుతున్న వివాదంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సీబీఐ విచారణకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం (పిల్)లో జోక్యం చేసుకోవడానికి ధర్మాసనం నిరాకరించింది. విచారణ సందర్భంగా స్పోర్ట్స్ కోటాలో అన్యాయం జరిగిందని చెబుతున్న అభ్యర్థులు స్వయంగా కోర్టును ఎందుకు ఆశ్రయించడం లేదని ప్రశ్నించింది. వారు భయపడుతున్నారనే వాదనను అంగీకరించబోమని స్పష్టం చేసింది.
డీఎస్సీ నియామకాలపై ఇప్పటికే 335 కేసులు హైకోర్టులో విచారణలో ఉన్నాయని పేర్కొన్న ధర్మాసనం, బాధితులు నేరుగా న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. ప్రజాహిత వ్యాజ్యం ఒక విలువైన రాజ్యాంగ పరిరక్షణ సాధనమని, దాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగిస్తే దాని అసలు ఉద్దేశం దెబ్బతింటుందని వ్యాఖ్యానించింది. వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసిన ఈ పిల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో డీఎస్సీ-2025 వ్యవహారంలో న్యాయపరమైన సవాళ్లు వ్యక్తిగత పిటిషన్ల ద్వారానే కొనసాగాల్సి ఉంటుందని సంకేతాలు ఇచ్చింది.
ALSO READ: T-Fiber | టీ-స్వాన్కు బదులుగా టీ-ఫైబర్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ఆదేశాలు








