Telangana Heat wave: తెలంగాణ వ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. రోహిణీ కార్తె ప్రవేశించిన నేపథ్యంలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. తెలంగాణ ప్రణాళికా సంఘం (TGDPS) మే 25న విడుదల చేసిన గరిష్ట ఉష్ణోగ్రతల వివరాల ప్రకారం రాష్ట్రంలోని ఎక్కువ జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరాయి.
చాలా ప్రాంతాల్లో ఎండ తీవ్రత 45 నుంచి 46.5 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవడంతో ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావడానికే భయపడుతున్నారు. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత పెరుగుతుండగా, మధ్యాహ్న సమయానికి పరిస్థితి నిప్పుల కొలిమిని తలపిస్తోంది.
రాష్ట్రంలో అత్యధికంగా కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. సూర్యాపేట, మంచిర్యాల జిల్లాల్లో 46.4 డిగ్రీలు, నల్గొండ, ఖమ్మం, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 46.3 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. పెద్దపల్లి, హనుమకొండ జిల్లాల్లో 46.2 డిగ్రీలు, జగిత్యాలలో 46.1 డిగ్రీలు, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, మహబూబాబాద్ జిల్లాల్లో 45.9 డిగ్రీల వరకు ఎండ తీవ్రత నమోదైంది.
వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, జనగామ, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్క్ను దాటాయి. దీంతో ఈ ప్రాంతాలు రెడ్ అలర్ట్ పరిధిలోకి వచ్చాయి.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మేడ్చల్–మల్కాజ్గిరిలో 42.4 డిగ్రీలు, రంగారెడ్డిలో 43.1 డిగ్రీలు, సంగారెడ్డిలో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
అయితే నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో మాత్రం 40 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదై కొంత ఉపశమనం లభించింది. అయినప్పటికీ రాబోయే మూడు రోజుల్లో కూడా ఎండల తీవ్రత తగ్గే సూచనలు లేవని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం వంటి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగి 45.7 డిగ్రీల వరకు చేరే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తం చేశారు. ప్రజలు మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.








