Petrol Bunk: తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ బంకుల్లో ఇంధన కొరత పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. ఒక్కసారిగా డిమాండ్ పెరగడం, సరఫరా తగ్గడంతో పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల ముందు వాహనాలు కిలోమీటర్ల మేర క్యూలో నిలుస్తున్నాయి. కొన్ని చోట్ల “నో స్టాక్” బోర్డులు దర్శనమిస్తుండటంతో ప్రజల్లో ఆందోళన మరింత పెరిగింది.
ఇంధన నిల్వలు తగ్గుతున్నాయనే ఊహాగానాలతో పాటు ధరలు పెరగవచ్చన్న వార్తల నేపథ్యంలో ప్రజలు అవసరానికి మించి పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేస్తున్నారు. దీంతో అందుబాటులో ఉన్న స్టాక్ త్వరగా ఖాళీ అవుతోందని డీలర్లు చెబుతున్నారు. రద్దీని నియంత్రించలేక బంక్ యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ పరిస్థితిని నియంత్రించేందుకు హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంక్ యాజమాన్యాలు కొత్త నిబంధనలు అమలు చేస్తున్నాయి. “రేషన్ పద్ధతి”లో ఒక్క వాహనానికి గరిష్టంగా రూ.1000 వరకు మాత్రమే ఇంధనం ఇవ్వాలని నిర్ణయించారు. బైక్లు, కార్లు, ఇతర వాహనాలన్నింటికీ ఇదే పరిమితి వర్తిస్తోంది. అలాగే ప్లాస్టిక్ బాటిళ్లు, డబ్బాలు, క్యాన్లలో ఇంధనం నింపడం పూర్తిగా నిషేధించారు.
అత్యవసర కారణాలు చెప్పినా అదనపు ఇంధనం ఇవ్వడం సాధ్యం కాదని బంక్ యజమానులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు చమురు సంస్థల సరఫరా ఆలస్యమే ఈ సమస్యకు కారణమని డీలర్లు ఆరోపిస్తున్నారు. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం దేశవ్యాప్తంగా సరిపడా నిల్వలు ఉన్నాయని, ప్రజల భయంతోనే అధిక కొనుగోళ్లు జరుగుతున్నాయని పేర్కొంటున్నాయి.








