Gandhi Bhavan: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. మిగిలిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియను ఈసీ తాజాగా ప్రారంభించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తన నేతలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
హైదరాబాద్ గాంధీ భవన్లో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ పాల్గొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనీలకు ఏఐసీసీ శిక్షణ విభాగానికి చెందిన సౌరభ్, అనూష, నిశాంత్ శిక్షణ అందిస్తున్నారు. శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనీలు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బూత్ లెవల్ ఏజెంట్లకు (BLA) శిక్షణ ఇవ్వనున్నారు.
ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి “సంఘటన్ సృజన్ అభియాన్” కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. జిల్లా, మండల కమిటీల ఏర్పాటు దాదాపు పూర్తయిందని ఆయన పేర్కొన్నారు.
పశ్చిమ బెంగాల్లో 93 లక్షల ఓట్లు తొలగించారని, అక్కడ బీజేపీ కుట్రల కారణంగా రాజకీయ పరిస్థితులు మారిపోయాయని ఆయన ఆరోపించారు. తెలంగాణలో అలాంటి పరిస్థితులు రాకుండా ప్రతి ఓటును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన స్పష్టం చేశారు.








