Tamil Nadu: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రైతులకు పెద్ద ఊరట కలిగించే కీలక నిర్ణయం ప్రకటించారు. రాష్ట్రంలోని సహకార బ్యాంకుల ద్వారా తీసుకున్న పంట రుణాలపై దృష్టి సారిస్తూ సవరించిన రుణమాఫీ పథకాన్ని ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. రైతుల ఆర్థిక భారం తగ్గించే లక్ష్యంతో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కొత్త నిర్ణయం ప్రకారం భూమి పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకోకుండా అర్హులైన రైతులందరికీ రూ. 75,000 వరకు పంట రుణాలు మాఫీ కానున్నాయి.
ప్రభుత్వ తాజా మార్గదర్శకాల ప్రకారం 2025 మే 1 నుంచి 2026 ఫిబ్రవరి 28 మధ్య కాలంలో సహకార బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకే ఈ పథకం వర్తిస్తుంది. రూ. 75,000 వరకు ఉన్న రుణాలను పూర్తిగా మాఫీ చేయనుండగా, ఆ మొత్తం దాటి ఉన్న రుణాల విషయంలో రూ. 35,000 వరకు మాఫీ వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా చిన్న, సన్నకారు, పెద్ద రైతులు అనే తేడా లేకుండా అన్ని వర్గాల రైతులకు ప్రయోజనం కలగనుంది. మొత్తం 14.43 లక్షల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారని అధికారులు తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం సుమారు రూ. 5,932.23 కోట్ల వ్యయాన్ని భరించనుంది. ఇంతకుముందు ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతులకు మాత్రమే రూ. 50,000 వరకు రుణమాఫీ చేయనున్నట్లు ప్రకటించింది.
అయితే ఈ పథకంపై రైతుల నుంచి వచ్చిన అభిప్రాయాలు, డిమాండ్ల నేపథ్యంలో ప్రభుత్వం కొత్తగా సమీక్ష చేపట్టింది. జూన్ 15న ముఖ్యమంత్రి విజయ్ మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి పథకంలో మార్పులు చేయాలని నిర్ణయించారు. ఫలితంగా అన్ని వర్గాల రైతులకు సమానంగా ప్రయోజనం కలిగేలా ఈ సవరించిన రుణమాఫీ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.








