Rohit Sharma Security Incident: టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ భద్రతకు సంబంధించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఇందౌర్లో జరిగిన వన్డే మ్యాచ్ సందర్భంగా హోటల్లోకి వెళ్లుతున్న రోహిత్ శర్మ వద్దకు ఓ మహిళ అకస్మాత్తుగా దూసుకొచ్చింది.
తన కుమార్తె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోందని, సాయం చేయాలని ఆమె వేడుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ALSO READ:ప్రయాగ్రాజ్ ఆర్మీ ప్లేన్ క్రాష్: వీడియో వైరల్ | Prayagraj Army Plane Crash Video
ఈ నేపథ్యంలో ఆ మహిళ సరితా శర్మ స్పందిస్తూ ఓ వీడియో విడుదల చేసింది. తన కుమార్తె అనిక ప్రాణాపాయ స్థితిలో ఉందని, ఆమె చికిత్సకు రూ.9 కోట్ల విలువైన ఇంజక్షన్ అవసరమని వెల్లడించింది. ఆ ఔషధాన్ని అమెరికా నుంచి తెప్పించాల్సి ఉందని తెలిపింది.
ఇప్పటివరకు నిధుల సేకరణ ద్వారా రూ.4.1 కోట్లు సమీకరించామని, సమయం చాలా తక్కువగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
టీమ్ ఇండియా, న్యూజిలాండ్ మ్యాచ్ సందర్భంగా వచ్చిన క్రికెటర్లను సాయం కోసం అర్థించాలనే ఉద్దేశంతో డొనేషన్ క్యాంప్ కూడా నిర్వహించినట్లు ఆమె తెలిపింది. అయితే తగినంత నిధులు సమకూరలేదని పేర్కొంది.
తన కుమార్తెను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను కలవాలనుకున్నానని, భావోద్వేగంలో రోహిత్ శర్మ చేతిని లాగానని ఆమె అంగీకరించింది.
ఈ ఘటనకు సంబంధించి తాను అధికారులకు క్షమాపణలు చెబుతున్నానని, సెల్ఫీల కోసం కాదని, తన కుమార్తె ప్రాణాల కోసమే అలా చేయాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తన పరిస్థితిని అర్థం చేసుకుని సాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేసింది.
