PM Modi: పశ్చిమ బెంగాల్లో జరిగిన సీఎం సువేందు అధికారి ప్రమాణస్వీకార కార్యక్రమంలో భావోద్వేగ ఘటన చోటుచేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, 98 ఏళ్ల వృద్ధ బీజేపీ కార్యకర్త మాఖన్ లాల్ సర్కార్కు పాదాభివందనం చేసి, ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సంఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
మాఖన్ లాల్ సర్కార్ పశ్చిమ బెంగాల్కు చెందిన సీనియర్ బీజేపీ కార్యకర్త. జనసంఘ్ రోజుల నుంచే పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేస్తున్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్ట్, తృణమూల్ కాంగ్రెస్ ప్రభావం బలంగా ఉన్న సమయంలో కూడా ఆయన బీజేపీ జెండాను వదలకుండా పార్టీ కోసం కష్టపడ్డారు. రాజకీయ ఒత్తిళ్లు, అనేక సవాళ్ల మధ్య కూడా ఆయన పార్టీ పట్ల నిబద్ధతతో కొనసాగారు.
కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమంలో సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోడీ, వేదికపై ఉన్న మాఖన్ లాల్ సర్కార్ను గమనించి వెంటనే ఆయన వద్దకు వెళ్లారు.
అనంతరం ఆయన పాదాలకు నమస్కరించి, ప్రేమగా కౌగిలించుకున్నారు. ఈ దృశ్యాన్ని చూసిన బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు జై శ్రీరామ్ నినాదాలతో సభా ప్రాంగణాన్ని మార్మోగించారు.
దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేసిన ఒక సాధారణ కార్యకర్తకు దేశ ప్రధాని ఇచ్చిన గౌరవంగా ఈ సంఘటనను రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. బెంగాల్లో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన చారిత్రాత్మక సందర్భంలో పాత తరం కార్యకర్తలను గుర్తుచేసుకోవడం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని చెబుతున్నారు.








