Janasena: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో జనసేన నాయకులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. జనసేన పార్టీ జాతీయ మీడియా ప్రతినిధి, ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ సూచనల మేరకు బుచ్చిరెడ్డిపాలెం నుంచి జొన్నవాడ శ్రీ కామాక్షి తాయి అమ్మవారి ఆలయం వరకు మహా పాదయాత్ర చేపట్టారు. కోవూరు నియోజకవర్గ జనసేన నాయకులు గాదిరాజు జీవన్ కృష్ణ, నక్కల శివకృష్ణ, బుచ్చిరెడ్డిపాలెం మండల నాయకులు చిరమణ సురేష్ ఆధ్వర్యంలో సుమారు 10 కిలోమీటర్ల మేర సాగిన ఈ పాదయాత్రలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో సాగిన యాత్ర అనంతరం అమ్మవారికి పవన్ కళ్యాణ్ తరఫున ఆషాఢ మాస సారెను సమర్పించారు. అమ్మవారి సన్నిధిలో పవన్ కళ్యాణ్ గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం, ఆయురారోగ్యాలు కలగాలని, ప్రజాసేవలో మరింత శక్తితో కొనసాగాలని ప్రార్థించారు. పాదయాత్ర మార్గంలో పలు గ్రామాల ప్రజలు, మహిళలు హారతులతో స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్పై ప్రజల్లో ఉన్న అభిమానం, విశ్వాసానికి ఈ కార్యక్రమం నిదర్శనంగా నిలిచిందని జనసేన నాయకులు తెలిపారు.








