NEET paper leak case: నీట్ (NEET) పరీక్షల్లో అక్రమాల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం వేగంగా స్పందించిందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు(Kiren Rijiju) తెలిపారు. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, అక్రమాలపై సమాచారం అందిన వెంటనే దర్యాప్తు ప్రారంభించి ప్రధాన నిందితులుగా గుర్తించిన 13 మందిని అరెస్టు చేసి జైలుకు పంపినట్లు వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకుండా తక్షణ చర్యలు చేపట్టామని, జాతీయ పరీక్షల సంస్థ (NTA) ద్వారా రీ-ఎగ్జామ్ నిర్వహించి ఫలితాలను కూడా ప్రకటించినట్లు చెప్పారు.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పరీక్షల నిర్వహణలో మరింత భద్రత కల్పించేలా కొత్త వ్యవస్థను రూపొందిస్తున్నామని తెలిపారు. అక్రమాలకు పాల్పడిన వారిపై ఎలాంటి రాజీ లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేసినట్లు వెల్లడించారు. ఇదే సమయంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఎస్జేపీ పార్టీ నిర్వహించిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులు, విద్యార్థులు గాయపడినట్లు సమాచారం రావడంతో పరిస్థితి హింసాత్మకంగా మారి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమైనట్లు వార్తలు వెలువడ్డాయి.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో దేశాభివృద్ధికి సంబంధించిన కీలక బిల్లుల ఆమోదానికి అన్ని పార్టీలు సహకరించాలని, రాజకీయ విభేదాలను పక్కనబెట్టి ప్రజా ప్రయోజనాల కోసం సభలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కిరణ్ రిజిజు విజ్ఞప్తి చేశారు.
ALSO READ: Kalitta Air plane | ఒక్క క్షణం ఆలస్యమైతే ఘోరమే..పైలట్ చాకచక్యంతో తప్పిన పెను ప్రమాదం








