Karnataka Politics: కర్ణాటకలో చోటుచేసుకున్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీఎం పదవికి రాజీనామా చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య ఢిల్లీలో పార్టీ కీలక నేతలు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. సీఎం పదవికి రాజీనామా చేసిన సిద్ధరామయ్య లేఖను గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఆమోదించిన వెంటనే ఆయన ఢిల్లీకి వెళ్లి హైకమాండ్తో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ ఆధ్వర్యంలో ఏర్పడబోయే కొత్త మంత్రివర్గంలో తన కుమారుడు యతీంద్రకు ప్రాధాన్యత కలిగిన శాఖలు ఇవ్వాలని సిద్ధరామయ్య అధిష్టానాన్ని కోరినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వైద్య ఆరోగ్య, విద్య, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖలతో పాటు పరిశ్రమలు లేదా జలవనరుల వంటి ప్రాధాన్యత గల శాఖలను ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.
అదే సమయంలో రాజ్యసభ, ఎమ్మెల్సీ నియామకాలపై కూడా సిద్ధరామయ్య తన అభిప్రాయాలను పార్టీ నాయకత్వానికి వెల్లడించినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు కాంగ్రెస్ హైకమాండ్ ప్రతిపాదించిన రాజ్యసభ సీటును సిద్ధరామయ్య తిరస్కరించినట్లు సమాచారం. కర్ణాటక రాజకీయాల్లోనే కొనసాగాలనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం సిద్ధరామయ్య డిమాండ్లపై కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. పార్టీ అంతర్గత సమీకరణాల మధ్య ఈ పరిణామాలు కర్ణాటక కాంగ్రెస్లో కొత్త చర్చకు దారితీశాయి.
ALSO READ: TDP Mahanadu | మహానాడులో టీడీపీకి భారీ విరాళాలు.. అత్యధికంగా రూ.5 కోట్లు








