Kadiri Brahmotsavam: శ్రీ కదిరి లక్ష్మీనరసింహ స్వామి(Sri Kadiri Lakshmi Narasimha Swamy) గుడిలో జరుగుతున్న బ్రహ్మరథోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. వేలాది మంది భక్తుల జయధ్వానాల మధ్య ఘనంగా సాగుతున్న రథోత్సవ సమయంలో ఒక్కసారిగా ప్రమాదం సంభవించింది.
రథాన్ని భక్తులు లాగుతున్న సమయంలో ఒక వ్యక్తి అనుకోకుండా రథచక్రం కింద పడిపోయాడు. అతన్ని కాపాడేందుకు ముందుకు వచ్చిన మరో ఐదుగురు కూడా రథచక్రాల కిందకు జారి పడడంతో కలకలం రేగింది. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు భక్తులు గాయపడ్డారు.
గాయపడిన వారిని వెంటనే చికిత్స కోసం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంతో రథోత్సవం కొంతసేపు నిలిచిపోయింది.
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో కదిరి పట్టణం జనసందోహంతో నిండిపోయింది. సంఘటన అనంతరం రథం పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించి భద్రతా చర్యలు చేపట్టారు.






