కరేబియన్ దేశం డొమినికన్ రిపబ్లిక్లో భారత సంతతికి చెందిన విద్యార్థిని సుదీక్ష కోణంకి అదృశ్యమయ్యారు. అమెరికాలోని పిట్స్బర్గ్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ చదువుతున్న సుదీక్ష, గత వారం స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లారు. వ్యూంటా కానా పర్యాటక ప్రాంతంలో ఆమె కనిపించకుండా పోయింది.
ఈ నెల 6న సుదీక్ష రియా రిపబ్లికా రిసార్ట్ సమీపంలోని బీచ్ వద్ద నడుచుకుంటూ వెళ్లినట్టు స్నేహితులు గుర్తుచేశారు. అనంతరం ఆమె తిరిగి రాకపోవడంతో, వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
సుదీక్ష ఆచూకీ కోసం పోలీసులు గత నాలుగు రోజులుగా డ్రోన్లు, హెలికాఫ్టర్లను ఉపయోగించి గాలింపు చర్యలు చేపట్టారు. సముద్రంలో తడిసి కొట్టుకుపోయి ఉంటుందనే అనుమానంతో నావికాదళం సాయంతో బీచ్ పరిసరాలను శోధిస్తున్నారు. ఇప్పటికీ ఆమె ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సుదీక్ష తల్లిదండ్రులు 20 ఏళ్ల క్రితం అమెరికాకు వలస వెళ్లి, వర్జీనియాలో శాశ్వత నివాసం పొందారు. ప్రస్తుతం ఆమె పిట్స్బర్గ్ యూనివర్శిటీలో చదువుతోంది. కూతురి కోసం గాలింపు చర్యలు వేగవంతం చేయాలని కుటుంబ సభ్యులు భారత దౌత్య అధికారులను సంప్రదించారు.