CM Revanth Reddy: ఖమ్మం జిల్లాలో నిర్వహించిన రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల షెడ్యూల్, కాంగ్రెస్ భవిష్యత్తు, బీఆర్ఎస్పై తన రాజకీయ అంచనాలను వెల్లడించారు. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తయ్యాకే తదుపరి ఎన్నికలు జరిగే అవకాశముందని పేర్కొంటూ, సాధారణంగా ఊహిస్తున్నట్లుగా 2028 డిసెంబర్లో కాకుండా 2029 జూన్లోనే ఎన్నికలు నిర్వహించే పరిస్థితి ఉంటుందని అభిప్రాయపడ్డారు.
పునర్విభజన తర్వాత తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 182కు, లోక్సభ స్థానాలు 17 నుంచి 25కు పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. కొత్త పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందని, 182 స్థానాల్లో కనీసం 117 స్థానాలను గెలుచుకుని వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు 65 సీట్లు వస్తాయని ముందుగానే చెప్పామని, అదే ఫలితం వచ్చిందని గుర్తు చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్, ఆ పార్టీ అధినేత కేసీఆర్పై కూడా రేవంత్ రెడ్డి తీవ్ర ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ పాలనకు ఇప్పటికే ముగింపు పలికారని, ఆ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని వ్యాఖ్యానించారు. హరీశ్రావు రాజకీయ భవిష్యత్తుపైనా ప్రశ్నలు లేవనెత్తుతూ, బీజేపీతో బీఆర్ఎస్ సంబంధాలపై కూడా విమర్శలు గుప్పించారు.
సభలో రైతు భరోసా పథకం కింద 1.44 లక్షల మంది రైతులకు రూ.1,009 కోట్ల ఆర్థిక సాయాన్ని విడుదల చేశారు. కన్నెపల్లి పంప్హౌస్ల అంశంపై స్పందించిన సీఎం, ఆ ప్రాజెక్టును ప్రారంభిస్తే భద్రాచలం ప్రాంతంతో పాటు పలు గ్రామాలకు ముంపు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉచిత విద్యుత్ పథకాన్ని కాంగ్రెస్ ప్రారంభించిందని గుర్తుచేస్తూ, రాష్ట్రంలో విద్యుత్ సరఫరా ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతోందని చెప్పారు.
CM Revanth Reddy | వచ్చే ఎన్నికల్లో 182 అసెంబ్లీ స్థానాల్లో 117 కాంగ్రెస్వే.. రేవంత్ రెడ్డి ధీమా
-








