FCRA Amendment Bill: ఎఫ్సీఆర్ఏ (విదేశీ విరాళాల నియంత్రణ చట్టం) సవరణ బిల్లుపై అంతర్జాతీయ స్థాయిలో చర్చ కొనసాగుతున్న వేళ, అమెరికా కాంగ్రెస్ సభ్యుడి వ్యాఖ్యలకు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇచ్చింది. ఈ అంశం పూర్తిగా భారత అంతర్గత వ్యవహారమని, దేశ చట్టాలకు సంబంధించిన నిర్ణయాలు పార్లమెంటే తీసుకుంటుందని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. విదేశాల నుంచి వచ్చే నిధుల ప్రవాహాన్ని నియంత్రించే నిబంధనలు భారత్కే పరిమితం కావని, అమెరికా సహా అనేక దేశాల్లో ఇలాంటి చట్టాలు అమల్లో ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. భారత చట్టాలపై విదేశీ వ్యాఖ్యలు అవసరం లేదన్న సంకేతాన్ని కూడా కేంద్రం ఇచ్చింది.
ఈ స్పందనకు కారణం అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రైలీ మూర్ చేసిన వ్యాఖ్యలు. ప్రతిపాదిత FCRA సవరణల వల్ల చర్చిలు, మతపరమైన సేవా సంస్థల నిర్వహణపై ప్రభుత్వ నియంత్రణ పెరిగే అవకాశం ఉందని, ఇది క్రైస్తవ సంస్థలపై ప్రభావం చూపుతుందని ఆయన ఆరోపించారు. ఈ బిల్లు భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలపై కూడా ప్రభావం చూపవచ్చని పేర్కొన్నారు. అయితే, ప్రతిపాదిత సవరణల ఉద్దేశం విదేశీ విరాళాల స్వీకరణ, వినియోగంలో మరింత పారదర్శకత తీసుకురావడమేనని కేంద్రం స్పష్టం చేస్తోంది. బిల్లులో భాగంగా ‘డిజిగ్నేటెడ్ అథారిటీ’ ఏర్పాటు చేసి, FCRA నమోదు రద్దైన లేదా గడువు ముగిసిన సంస్థల విదేశీ నిధులు, వాటితో ఏర్పడిన ఆస్తుల నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థను ప్రతిపాదించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం 2019-2022 మధ్య 13,520 సంస్థలు విదేశీ విరాళాల రూపంలో రూ.55,741 కోట్లను స్వీకరించాయి.








