Export Duty: అంతర్జాతీయ పరిస్థితులు కొంత మేర సానుకూలంగా మారుతున్నప్పటికీ, దేశంలో ఇంధన కొరత తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ఎగుమతులపై అదనపు ఎక్సైజ్ డ్యూటీని పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. సవరించిన కొత్త పన్ను రేట్లు మంగళవారం నుంచి అమల్లోకి రానున్నాయి.
కొత్త సవరణల మేరకు డీజిల్ ఎగుమతులపై లీటరుకు వసూలు చేస్తున్న పన్నును రూ.13.05 నుంచి రూ.14కు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అలాగే ఏటీఎఫ్ ఎగుమతులపై ఉన్న డ్యూటీని లీటరుకు రూ.9.05 నుంచి రూ.12.05కు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే పెట్రోల్ ఎగుమతులపై ప్రస్తుతం అమలులో ఉన్న రూ.1.05 పన్నును యథాతథంగా కొనసాగించనున్నట్లు స్పష్టం చేసింది.
అధికారుల వివరాల ప్రకారం, దేశీయ వినియోగానికి అందుబాటులో ఉండే పెట్రోల్, డీజిల్ ధరలు లేదా వాటిపై విధించే పన్నుల్లో ఎలాంటి మార్పులు ఉండవు. విదేశాలకు ఎగుమతి చేసే ఇంధన ఉత్పత్తులపైనే ఈ పెంపు వర్తించనుంది.
దేశంలో ఇంధన సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడడంతో పాటు, స్థానిక అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో కేంద్రం ఇప్పటికే పెట్రోలియం ఉత్పత్తులపై ఎగుమతి సుంకాలను అమలు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో దేశంలో ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉండేలా ఈ చర్యలు చేపట్టినట్లు కేంద్ర వర్గాలు పేర్కొన్నాయి.








