Heavy Rains: తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 18వ తేదీ నుంచి వరుసగా మూడు రోజులపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. హైదరాబాద్తో పాటు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయడంతో ప్రజలు, రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఐదు సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మరోవైపు 15 నుంచి 17 తేదీల మధ్య ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు నెమ్మదిగా విస్తరిస్తున్నాయి. అయితే ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఇంకా పూర్తిస్థాయిలో వ్యాపించకపోవడంతో అక్కడ ఎండల ప్రభావం కొనసాగుతోంది. ఇటీవల రామగుండంలో 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా, పలు జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రాబోయే వర్షాలతో ఉష్ణోగ్రతలు తగ్గడంతో పాటు వ్యవసాయానికి కూడా అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని అధికారులు భావిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తమ పంటల రక్షణకు తగిన చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్లో GHMC సిబందిని ప్రభుత్వం అప్రమత్తం చేసింది.








