Monsoon clouds: నైరుతి రుతుపవనాలు ఈసారి దేశాన్ని సాధారణానికి ముందుగానే తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఈ నెల 14 నుంచి 16 తేదీల మధ్య అండమాన్–నికోబార్ దీవులకు నైరుతి గాలులు చేరే అవకాశం ఉందని తెలిపింది. ఇది సాధారణంగా వచ్చే సమయంతో పోలిస్తే కొంత ముందుగానే కావడం గమనార్హం.
ఈ ప్రారంభం ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షపాతం మే నెలలో సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది. ముఖ్యంగా దక్షిణ భారతదేశం మరియు పశ్చిమ భారతంలోని కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.
అయితే ఈశాన్య రాష్ట్రాలు, తూర్పు–మధ్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఉష్ణోగ్రతల విషయానికి వస్తే, ఈసారి మే నెలలో పగటి వేడి మాత్రమే కాకుండా రాత్రి వేళల్లో కూడా అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని ఐఎండీ పేర్కొంది. కొన్ని దక్షిణ ద్వీపకల్ప ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలో లేదా కొద్దిగా తక్కువగా ఉండే అవకాశం ఉంది.
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వంటి తీర రాష్ట్రాల్లో సముద్రం నుంచి వచ్చే తేమతో కూడిన వేడి గాలుల కారణంగా ఉక్కపోత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.








