Delhi Liquor Policy case: డిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రౌస్ అవెన్యూ కోర్ట్ (Rouse Avenue Court) సంచలన తీర్పు వెలువరించి, సరైన ఆధారాలు లేకుండా కేసు నమోదు చేశారంటూ సీబీఐ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
భారీ ఛార్జ్షీట్లో పలు లోపాలు ఉన్నాయని, ఆరోపణలకు తగిన సాక్ష్యాలు, వాంగ్మూలాలు లేవని స్పష్టం చేసింది. దీంతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది.
సీబీఐ నమోదు చేసిన అన్ని అభియోగాలను కోర్టు కొట్టివేస్తూ క్లీన్ చిట్ ఇచ్చింది. ప్రత్యేక సీబీఐ కోర్టు న్యాయమూర్తి జితేందర్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే కేసులో అరవింద్ కేజ్రీవాల్, సిసోడియా లకు కూడా ఉపశమనం లభించింది. ఐదు నెలల పాటు జైలులో ఉన్న కవితకు ఈ తీర్పు కీలక మలుపుగా మారింది.
తీర్పుపై స్పందించిన కవిత “నిజం గెలిచింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు ఆరోపణల నుంచి పూర్తిగా నిర్దోషిగా బయటపడ్డాను. నా కుటుంబం, నాపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
రాజకీయ కుట్రతోనే ఈ కేసు పెట్టారని ఇప్పుడు స్పష్టమైంది” అని పేర్కొన్నారు. కేసు పేరుతో తనపై మూడేళ్లుగా విమర్శలు, సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొన్నానని, అయినా ధైర్యంగా నిలబడ్డానని భావోద్వేగంగా తెలిపారు.
ALSO READ:పెళ్లి వేడుకలో రక్తదాన శిబిరం ఏర్పాటు…పెళ్లిని సేవా కార్యక్రమంగా మార్చిన వరుడు








