మధ్యప్రదేశ్లో చోటుచేసుకున్న ఓ వింత సంఘటన అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. 18 నెలల క్రితం అదృశ్యమైన లలితా బాయి అనే మహిళను చనిపోయిందని భావించిన కుటుంబసభ్యులు, గుర్తుతెలియని ఓ మృతదేహాన్ని ఆమెదేనని పొరబడి అంత్యక్రియలు కూడా జరిపారు. అయితే తాజాగా ఆ మహిళ ఊహించని విధంగా ఇంటికి తిరిగి రావడంతో కుటుంబం ఒక్కసారిగా షాక్కు గురైంది.
మండ్సర్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వివరాలు వెల్లడించారు. లలితా బాయి అదృశ్యమైన తరువాత కుటుంబసభ్యులు ఆమె కోసం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే గుర్తు తెలియని ఓ మృతదేహాన్ని గుర్తించలేకపోయిన పోలీసులు, లలితా తల్లిదండ్రులు ఇచ్చిన వివరాల ఆధారంగా అది వారి కూతురిదేనని భావించారు. తల్లిదండ్రులు కూడా పొరపాటుగా గుర్తించి లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
ఈ హత్య కేసులో నలుగురిని నిందితులుగా భావించి పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. అయితే లలితా బాయి తిరిగి ఇంటికి వచ్చిన తరువాత అసలు నిజం బయటపడింది. లలితా పోలీసులకు తన కథను వివరిస్తూ, ఓ వ్యక్తి మోసం చేసి రూ. 5 లక్షలకు అమ్మేశాడని, బంధీగా ఉండటంతో బయటకు రాలేకపోయానని చెప్పింది.
ఈ ఘటనపై ఇప్పుడు కొత్తగా విచారణ జరుగుతోంది. తప్పుగా జైలుకు పంపిన నలుగురి పరిస్థితి ఏమిటి? పొరపాటు చేసిన పోలీసులపై చర్యలు తీసుకుంటారా? అనే ప్రశ్నలు జనాల్లో చర్చనీయాంశమయ్యాయి.