మిర్యాలగూడ గాంధీనగర్‌లో కార్డెన్ సెర్చ్‌ ఆపరేషన్‌

Police conducted a massive cordon search in Miryalaguda, seizing 56 bikes and 4 autos. DSP issued key warnings to the youth and parents.

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని గాంధీనగర్‌లో పోలీసులు కార్డెన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. డీఎస్పీ రాజశేఖర్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. ఈ ఆపరేషన్‌లో ఇద్దరు సీఐలు, 8 మంది ఎస్‌ఐలు, 75 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కాలనీలో రౌడీషీటర్లు, అనుమానితుల ఇళ్లలో గాలింపు జరిపారు.

ఫుట్ పెట్రోలింగ్‌తో పాటు అనుమానాస్పద వాహనాలను తనిఖీ చేశారు. సరైన డాక్యుమెంట్లు లేకుండా ఉన్న 56 బైకులు, 4 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. వాహనదారులు ధ్రువపత్రాలు తీసుకువెళ్లాలని పోలీసులు సూచించారు. ఈ తనిఖీల్లో పాల్గొన్న పోలీసు బృందం శాంతి భద్రతల పరిరక్షణ కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది.

ఈ సందర్భంగా డీఎస్పీ రాజశేఖర్ రాజు మాట్లాడుతూ, చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మైనర్ పిల్లలకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వకుండా జాగ్రత్త వహించాలని కోరారు. వేగంగా వాహనాలు నడపొద్దని, ప్రాణాలు ముప్పులో పడేలా చేయొద్దని సూచించారు.

అలాగే యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా జాగ్రత్త పడాలని చెప్పారు. పర్మిషన్ లేకుండా డీజే వాడితే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ తరహా కార్డెన్‌ సెర్చ్‌ ఆపరేషన్లు మిర్యాలగూడ సబ్‌డివిజన్ పరిధిలో మరిన్ని చోట్ల కొనసాగుతాయని డీఎస్పీ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *