ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్రంలోని కలెక్టర్లతో రెండు రోజుల పాటు సమీక్షా సమావేశం జరుగనుంది. ఈ రోజు (మంగళవారం) ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో సీసీఎల్ఏ ప్రారంభోపన్యాసం చేయనున్నారు. ప్రధాన కార్యదర్శి, మంత్రులు కూడా తమ అభిప్రాయాలను వెల్లడించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లను ఉద్దేశించి కీలక ప్రసంగం చేయనున్నారు.
సమావేశంలో వాట్సాప్ గవర్నెన్స్, ఆర్టీజీఎస్, ల్యాండ్ సర్వే, వేసవి నీటి ఎద్దడి వంటి ప్రభుత్వ ప్రాధాన్య అంశాలపై చర్చ జరగనుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నీటి సరఫరా, జిల్లాల ఆదాయ మార్గాలు, రెవెన్యూ సమస్యలు మొదలైన అంశాలపై జిల్లాల వారీగా సమీక్ష చేయనున్నారు.
ఇంతకు ముందు జరిగిన కలెక్టర్ల సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలు స్థితిగతులపై సమీక్ష జరుగనుంది. ప్రభుత్వ నిధుల వినియోగం, అభివృద్ధి ప్రణాళికలు, ప్రజా సంక్షేమ పథకాలు వంటి అంశాలపై కలెక్టర్లతో సీఎం చంద్రబాబు కీలక దిశానిర్దేశం చేయనున్నారు.
ఈ సమీక్షలో ప్రతి జిల్లాలో నెలకొన్న ముఖ్య సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కలెక్టర్లను ఆదేశించే అవకాశం ఉంది. రాష్ట్రంలోని పాలనను మరింత సమర్థంగా తీర్చిదిద్దే విధంగా ప్రభుత్వ విధానాలను అమలు చేయడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు.