ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా మారాలంటే పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అమరావతిలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన సీఎం, గతంలో హైదరాబాద్ అభివృద్ధి అనుభవాలను గుర్తు చేశారు.
ఒకప్పుడు పెద్ద స్థాయి ఆసుపత్రులు లేకపోయినా, గల్ఫ్ దేశాల హాస్పిటాలిటీ వ్యవస్థను అధ్యయనం చేసి తీసుకొచ్చిన మార్పులతో హైదరాబాద్ మెడికల్ హబ్గా మారిందని తెలిపారు.
ప్రస్తుతం వైద్యులు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నేర్చుకుని ముందుకు సాగాలని సీఎం సూచించారు. అమరావతి అభివృద్ధి తన కల అని పేర్కొంటూ, కొత్తగా శంకుస్థాపన చేసిన యూనివర్సిటీ ద్వారా దాదాపు లక్ష ఉద్యోగ అవకాశాలు సృష్టించబడతాయని చెప్పారు. 2027 నాటికి యూనివర్సిటీ భవనం పూర్తి చేసి ప్రారంభిస్తానని వెల్లడించారు.
విశాఖపట్నం అభివృద్ధిపై కూడా సీఎం కీలక ప్రకటనలు చేశారు. ఆగస్టు 15 కంటే ముందే గూగుల్ విశాఖలో కార్యకలాపాలు ప్రారంభిస్తుందని తెలిపారు. అలాగే ఆర్సెలార్ మిట్టల్(ArcelorMittal) సంస్థ 2028 డిసెంబర్ నాటికి తొలి దశ పనులు పూర్తి చేస్తుందని పేర్కొన్నారు. కిమ్స్ ఆసుపత్రి నిర్మాణానికి ఆటోపైలట్ విధానంలో అనుమతులు ఇస్తామని, నిర్మాణం పూర్తి చేయడం సంస్థ బాధ్యత అని స్పష్టం చేశారు.
అమరావతిని హైదరాబాద్ కంటే మెరుగైన నగరంగా తీర్చిదిద్దుతామని సీఎం ధీమా వ్యక్తం చేశారు. కృష్ణా నదిపై మరిన్ని ఫ్లైఓవర్లు నిర్మిస్తే నగరం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. రాయలసీమను “రత్నాల సీమ”గా మారుస్తామని, అమరావతి, విశాఖ, రాయలసీమ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు తెలిపారు.








