Ganga-Kaveri: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గంగా–కావేరి నదుల అనుసంధానం తన ప్రగాఢ ఆకాంక్ష అని శాసనసభలో వెల్లడించారు. ప్రకృతిని ఆరాధించడం, నీటిని పూజించడం మన సంస్కృతిలో భాగమని పేర్కొన్నారు. గోదావరికి అఖండ హారతి, కృష్ణా నదికి పవిత్ర హారతి నిర్వహించిన విషయాన్ని గుర్తుచేస్తూ నదులను పూజించడం భారతీయ సంప్రదాయమని తెలిపారు.
సాగునీటి రంగంపై చర్చ సందర్భంగా నదుల అనుసంధానం వల్ల భవిష్యత్తులో నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అభిప్రాయపడ్డారు.
గంగా–కావేరి అనుసంధానం సాధ్యాసాధ్యాలపై గతంలోనే చర్చలు జరిగాయని, చిన్న ఆలోచనతోనే మహత్తర కార్యాలు ఆరంభమవుతాయని చెప్పారు. పట్టిసీమ ద్వారా 100 టీఎంసీల నీటిని కృష్ణా నదికి మళ్లించామని వెల్లడించారు. వెలిగొండ ప్రాజెక్టుకు తానే శంకుస్థాపన చేసి, పూర్తి దశకు తీసుకెళ్తున్నానని పేర్కొన్నారు.
ధవళేశ్వరం వద్ద నిర్మించిన ఆనకట్ట వల్లే గోదావరి జిల్లాలు సస్యశ్యామలమయ్యాయని, ఆ నిర్మాణానికి కృషి చేసిన కాటన్ దొరను ప్రజలు ఇప్పటికీ స్మరించుకుంటున్నారని తెలిపారు. నదుల అనుసంధానం ద్వారా తెలుగుతల్లికి జలహారతి ఇవ్వడం తమ బాధ్యత అని సీఎం స్పష్టం చేశారు.
ALSO READ:Narendra Modi | సోషల్ మీడియాలో మోడీ క్రేజ్….అత్యధిక ఫాలోవర్లు కలిగిన నేతగా మోడీ








