Tomato Farmers: బొబ్బిలి పరిసరాల్లో టమాటా రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఎకరాకు 18 నుంచి 20 టన్నుల వరకు భారీ దిగుబడి వచ్చినా, ధరలు పూర్తిగా కుప్పకూలడంతో లాభం శూన్యంగా మారింది దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కిలో టమాటాను రూ.2కే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా కొనుగోలుదారులు ముందుకు రావడం లేదు. జిల్లాలో అతిపెద్ద మార్కెట్గా పేరున్న రామభద్రపురంలో రైతులు రోజంతా వేచి చూసినా పంట అమ్ముడవ్వని దుస్థితి నెలకొంది.
గత నెలలో కిలో రూ.40 వరకు ధర ఉన్నా, అప్పటికి పంట చేతికి రాలేదని రైతులు చెబుతున్నారు. ఇప్పుడు పంట సమూహంగా మార్కెట్కు రావడంతో ధరలు క్షీణించాయని ఉద్యానశాఖ అధికారులు వివరిస్తున్నారు. సాధారణంగా నవంబర్, డిసెంబర్లో నారు వేస్తారు.
ఈసారి వర్షాభావం కారణంగా ఎక్కువ మంది రైతులు ఒకేసారి సాగు చేయడంతో మార్కెట్లో అధిక సరఫరా ఏర్పడింది. సాధారణంగా ఎకరాకు 13–15 టన్నుల దిగుబడి వస్తే, ఈసారి 20 టన్నుల వరకు రావడం ధర పతనానికి దారితీసింది.
ఎకరా సాగుకు సుమారు రూ.50 వేల ఖర్చవుతుండగా, అమ్మకాల ద్వారా రూ.35 వేలైనా రాబడిలేక రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారు.
కూలీ చెల్లించేందుకు కూడా డబ్బులు లేక కొందరు పొలాల్లోనే పంట వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వేసవిలో మంచి ధరలు వస్తాయని ఆశించిన రైతులకు ఈ పరిణామం గట్టి దెబ్బగా మారింది.









