AP government New Pension: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో పెన్షన్ పంపిణీ వ్యవస్థను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తూ, ప్రతి నెలా ఒకటో తేదీన సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇంటివద్దకే పెన్షన్ అందిస్తోంది. ఎన్నికల హామీల ప్రకారం పెంచిన పెన్షన్లను కూడా ప్రభుత్వం నిరంతరం పంపిణీ చేస్తోంది.
ఇప్పటికే పెద్ద సంఖ్యలో కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులను పరిశీలించి ప్రభుత్వం దశలవారీగా నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా కిడ్నీ, లివర్, హార్ట్ సంబంధిత దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కొత్తగా 895 పెన్షన్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
దీనికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో నెలకు సుమారు రూ.86 లక్షల అదనపు భారం రాష్ట్ర ఖజానాపై పడనుంది.
ఇక వితంతు పెన్షన్లకు ఇప్పటికే ఆమోదం లభించగా, దివ్యాంగుల పెన్షన్ల మంజూరు పై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్ష మంది దివ్యాంగులు కొత్త పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఉన్న 6.5 లక్షల దివ్యాంగ పెన్షనర్లలో కొంతమంది అనర్హులుగా గుర్తించబడ్డారని వైద్యాధికారులు నివేదిక ఇచ్చారు. వారిని తొలగించి అర్హులకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది.
మొత్తం అన్ని కేటగిరీలలో కొత్త పెన్షన్ల ప్రక్రియ వేగవంతమైతే దాదాపు 10 లక్షల మంది వరకు లబ్ధి పొందే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి నెలకు సుమారు రూ.400 కోట్లు, సంవత్సరానికి రూ.4800 కోట్ల అదనపు భారం పడే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.








