AP Government: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. బుక్ చేసిన 2 నుంచి 3 రోజుల్లోనే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ డెలివరీ చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది. రాష్ట్రంలో గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, సోషల్ మీడియాలో జరుగుతున్న కొరత ప్రచారాన్ని నమ్మవద్దని అధికారికంగా తెలిపింది.
కేంద్ర స్థాయిలో కూడా దేశంలో ఎల్పీజీ సరఫరా సాధారణంగానే కొనసాగుతోందని, రోజుకు లక్షల సంఖ్యలో సిలిండర్లు డెలివరీ అవుతున్నాయని అధికారులు వెల్లడించారు.
ఇటీవల పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా కొంతమందిలో ఆందోళన పెరిగింది. అయితే, పెట్రోల్, డీజిల్, గ్యాస్కు ఎలాంటి కొరత లేదని ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. గ్యాస్ లేదనే టెన్షన్తో ప్రజలు అనవసరంగా బుకింగ్స్ చేయవద్దని, ఏజెన్సీల చుట్టూ తిరగవద్దని సూచించింది.
సరఫరా వ్యవస్థను ప్రభుత్వం క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తోందని, డిస్ట్రిబ్యూటర్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పెండింగ్ బుకింగ్స్ను ట్రాక్ చేస్తున్నట్లు సమాచారం.
అధికారుల సమాచారం ప్రకారం, సోషల్ మీడియాలో కొంతమంది తప్పుడు ప్రచారం చేసి ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని, అలాంటి వదంతులను పూర్తిగా పట్టించుకోకూడదని సూచించారు. అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
హర్మోజ్ మార్గంలో రవాణాపై ఉన్న అడ్డంకులు తగ్గడంతో, ఇండియాకు రావాల్సిన నౌకలు మళ్లీ చేరుకున్నాయని, దీంతో ఎల్పీజీ నిల్వలు మరింత స్థిరపడ్డాయని తెలుస్తోంది.
మొత్తంగా, బుక్ చేసిన సిలిండర్ను 2-3 రోజుల్లో అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం వినియోగదారులకు పెద్ద ఊరటగా మారింది.








