ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కీలక సమాచారం అందింది. AP EAPCET 2026 కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్ను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. దీనిపై ఉన్నత విద్యాశాఖలో ప్రాథమిక స్థాయిలో నిర్ణయం ఖరారైనట్లు తెలుస్తోంది. దీంతో ఎంసెట్లో అర్హత సాధించిన అభ్యర్థులు అవసరమైన పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ప్రస్తుతం కళాశాలల అనుబంధ గుర్తింపులు, ప్రవేశాలకు సంబంధించిన పరిపాలనా ప్రక్రియలు తుది దశకు చేరుకున్నాయి. అవి పూర్తయిన వెంటనే కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ నెల 15వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఈ ఏడాది కూడా కౌన్సెలింగ్ మొత్తం ఆన్లైన్ విధానంలోనే నిర్వహించనున్నారు. మొదట అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో నమోదు చేసుకుని హాల్ టికెట్ నంబర్, ర్యాంక్ వివరాలతో లాగిన్ అవ్వాలి. అనంతరం కౌన్సెలింగ్ ఫీజు చెల్లించి సర్టిఫికెట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్లు, సీట్ల కేటాయింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ వంటి దశలను పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఇదిలా ఉండగా, ఇంజనీరింగ్ కళాశాలల ఫీజుల్లో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. కనీస వార్షిక ట్యూషన్ ఫీజు రూ.40 వేల నుంచి రూ.47 వేల వరకు ఉండే అవకాశం ఉందని సమాచారం. రాష్ట్రంలోని కళాశాలల వివరాలను పరిశీలించిన అనంతరం ఆంధ్రప్రదేశ్ ఫీజుల నియంత్రణ కమిటీ తుది ఫీజులను ప్రకటించనుంది. కొత్త ఫీజు నిర్మాణం 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
కౌన్సెలింగ్లో పాల్గొనే విద్యార్థులు అవసరమైన అన్ని ధ్రువపత్రాలు, గుర్తింపు పత్రాలు, విద్యార్హత సర్టిఫికెట్లు, TC, ఆధార్ వంటి పత్రాలను ముందుగానే పరిశీలించి సిద్ధంగా ఉంచుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు.








