APSDMA: ఆంధ్రప్రదేశ్కు 28 జిల్లాలతో కొత్త మ్యాప్ విడుదలైందన్న ప్రచారం పూర్తిగా అసత్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) స్పష్టం చేసింది. ఇటీవల సోషల్ మీడియా వేదికల్లో, అలాగే కొన్ని డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఒక మ్యాప్ వేగంగా వైరల్ అయింది.
అందులో అమరావతిని ఏపీ రాజధానిగా చూపిస్తూ, దాన్ని APSDMA అధికారికంగా విడుదల చేసిందని ప్రచారం జరిగింది. అయితే ఈ సమాచారం ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉందని సంస్థ అధికారికంగా వెల్లడించింది.
ఏప్రిల్ 6, 2026న విడుదల చేసిన ప్రకటనలో, తమ తరఫున ఎటువంటి కొత్త రాష్ట్ర మ్యాప్ను జారీ చేయలేదని APSDMA క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న 28 జిల్లాల మ్యాప్కు తమ సంస్థతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.
ముఖ్యంగా APSDMA పేరు, లోగోను ఉపయోగించి ఆ మ్యాప్ను షేర్ చేయడం పూర్తిగా తప్పుదారి పట్టించే చర్యగా పేర్కొంది.
ఈ నేపథ్యంలో ప్రజలు, మీడియా సంస్థలు ధృవీకరించని సమాచారాన్ని నమ్మకూడదని, అలాగే అలాంటి పోస్టులను ఫార్వర్డ్ చేయకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ప్రభుత్వ సంస్థల పేర్లు, చిహ్నాలు ఉపయోగించి సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతున్న సందర్భాల్లో మరింత జాగ్రత్త అవసరమని హెచ్చరించారు.
అధికారిక ప్రకటనలు, ప్రభుత్వ సంస్థల ధృవీకరించిన సమాచారాన్నే విశ్వసించాలని APSDMA కోరింది. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి విజువల్ లేదా డాక్యుమెంట్ నిజమని భావించడం ప్రమాదకరమని, ప్రజలు ముందుగా వాస్తవాలు తెలుసుకుని స్పందించాల్సిన అవసరం ఉందని అధికారులు తెలిపారు.
ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ మ్యాప్ విషయంలో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.








