E20 Petrol Quality Check: E20 పెట్రోల్పై నెలకొన్న అపోహలకు తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వినియోగదారులకు అందించే ఇంధనం నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందో లేదో చమురు సంస్థలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంకుల్లో ఇంధన నాణ్యతపై నిరంతర నిఘా కొనసాగుతోందని, ప్రతి రోజు 8 నుంచి 12 సార్లు నాణ్యతా పరీక్షలు చేపడుతున్నట్లు కేంద్రం పేర్కొంది. పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం.. ఇప్పటివరకు దేశంలో క్లోరైడ్ కలుషితానికి సంబంధించిన రెండు ఘటనలు మాత్రమే గుర్తించారు. ఆ రెండు కేంద్రాల్లో వెంటనే ఇంధన విక్రయాలను నిలిపివేసి చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది.
అలాగే దేశవ్యాప్తంగా 2 వేలకు పైగా ఇంధన నమూనాలను క్లోరైడ్, సల్ఫైడ్ కలుషితాల కోసం పరీక్షించినట్లు వెల్లడించింది. E20 పెట్రోల్లో ఉపయోగించే ఇథనాల్ తప్పనిసరిగా BIS IS 15464 ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది. ఇథనాల్ స్వచ్ఛత కనీసం 99.6 శాతం ఉండాలని, ప్రతి సరఫరాకు నాణ్యత ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా జత చేయాలని తెలిపింది. ఇథనాల్ నిల్వ కోసం ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఇంధన సరఫరా వ్యవస్థలో ప్రతి దశను చమురు సంస్థలు పరిశీలిస్తున్నాయని కేంద్రం పేర్కొంది.
ట్యాంకర్ల నుంచి ఇంధనం స్వీకరించే ముందు పై, కింది భాగాల నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. 2024 జూలై నుంచి 2026 జూన్ వరకు నాణ్యత ప్రమాణాలు పాటించని 302 ట్యాంకర్లను తిరస్కరించినట్లు వెల్లడించింది. వాటిలో సుమారు 10,500 కిలోలీటర్ల ఇథనాల్ ఉన్నట్లు తెలిపింది. కల్తీ లేదా నాణ్యత లోపాలు గుర్తిస్తే కఠిన చర్యలు తప్పవని కేంద్రం స్పష్టం చేసింది.
ALSO READ: CM Revanth Reddy | ఢిల్లీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి.. కేంద్ర మంత్రులతో కీలక భేటీలు








