CRPF: సీఆర్పీఎఫ్ జవాన్లకు డైరెక్టర్ జనరల్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ కీలక భరోసా ఇచ్చారు. విధి నిర్వహణలో నిజాయితీతో తీసుకునే ప్రతి నిర్ణయానికి తానే పూర్తి బాధ్యత వహిస్తానని స్పష్టం చేశారు. ఎలాంటి ఒత్తిడి, భయానికి లోనుకాకుండా ధైర్యంగా దేశ సేవలో ముందుండాలని జవాన్లకు పిలుపునిచ్చారు. CRPF ఇన్వెస్టిచర్ కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన, జనరల్ బెటాలియన్ విధులు, లా అండ్ ఆర్డర్ నిర్వహణ లేదా ఇతర బాధ్యతల్లో నిజాయితీతో తీసుకునే ప్రతి నిర్ణయానికి డైరెక్టర్ జనరల్గా తానే జవాబుదారినని తెలిపారు. దీంతో సిబ్బంది ఎలాంటి సంకోచం లేకుండా విధులను సమర్థంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.
నీట్ పేపర్ లీక్కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల సందర్భంగా ఆర్ఏఎఫ్ చేపట్టిన విధి నిర్వహణపై సమగ్ర సమీక్ష చేపట్టనున్నట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా నిరసనలు, అల్లర్ల పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సీఆర్పీఎఫ్లో భాగమైన ఆర్ఏఎఫ్ అల్లర్ల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రత్యేక శిక్షణ పొందిన బలగంగా గుర్తింపు పొందింది. రాష్ట్ర పోలీసులతో సమన్వయం చేసుకుంటూ పలు ప్రాంతాల్లో శాంతి భద్రతల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తోంది.
అదే విధంగా ఈశాన్య రాష్ట్రాల్లో తిరుగుబాటు గ్రూపుల కార్యకలాపాలను అణచివేయడం, దేశంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఆపరేషన్లు నిర్వహించడం వంటి కీలక బాధ్యతలను సీఆర్పీఎఫ్ సమర్థంగా నిర్వహిస్తోంది. కోబ్రా కమాండోలు అటవీ ప్రాంతాల్లో గెరిల్లా యుద్ధం, ప్రత్యేక ఆపరేషన్లలో నైపుణ్యం కలిగి ఉన్నారు. దేశ భద్రత పరిరక్షణలో సీఆర్పీఎఫ్ కీలక పాత్ర పోషిస్తూ విశేష సేవలందిస్తోంది.
ALSO READ: Ajinkya Rahane | ‘క్యాప్ 278 సైన్ ఆఫ్’.. క్రికెట్కు గుడ్బై చెప్పిన అజింక్య రహానే








